స్పిల్ చానల్లో పనులకు వీలుగా నీటి తొలగింపు
నెలాఖరు నుంచే గేట్ల బిగింపు పనులు ప్రారంభం
జూన్లో వచ్చే వరద స్పిల్ వే మీదుగా మళ్లింపు
నేడు కాఫర్ డ్యామ్లను పరిశీలించనున్న సీఎస్ఎంఆర్ఎస్ బృందం
వచ్చే ఏడాది డిసెంబర్లోగా ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్ చానల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తేగానీ అక్కడ కాంక్రీట్ పనులు సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పిల్ వే, స్పిల్ చానల్లో నిల్వ ఉన్న వరద నీటిని తోడేసే (డీవాటరింగ్) పనులను అధికారులు వేగవంతం చేశారు. 83.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 22 పంపులతో స్పిల్ చానల్లో 15.795 మీటర్ల ఎత్తున నిల్వ ఉన్న నీటిని ఎత్తి గోదావరిలోకి పోస్తున్నారు. సోమవారం నుంచి మరిన్ని పంపులను అమర్చనున్నారు.
నేడు కాఫర్ డ్యామ్ల పరిశీలనకు సీఎస్ఎంఆర్ఎస్ బృందం:
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. గోదావరి వరదల ఉధృతి ప్రభావం కాఫర్ డ్యామ్లపై ఎలా ఉందనే విషయాన్ని అధ్యయనం చేసి.. వాటిని పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆ బృందం దిశానిర్దేశం చేస్తుంది.
మే నుంచి ఈసీఆర్ఎఫ్ పనులు
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్-ఈసీఆర్ఎఫ్)ను మూడు భాగాలుగా నిర్మిస్తారు. ఇందులో గ్యాప్-1, గ్యాప్-3ల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. గ్యాప్-2లో ప్రధానమైన ఈసీఆర్ఎఫ్ పనులను వచ్చే మేలో ప్రారంభించి.. నిరాటంకంగా చేయడం ద్వారా డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.