సంక్రాంతి సంబరాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకొని ఇద్దరు మృతి

16 Jan, 2023 14:49 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది.  కోడి పెందేలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు.

ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆనందంగా జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పద్మారావు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరో చోట
అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్‌ అనే మరో వ్యక్తి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు

మరిన్ని వార్తలు