ఆయ్‌.. ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్‌ సూపరండీ బాబూ..

14 Apr, 2021 11:16 IST|Sakshi
రెండో యూనిట్‌లో తయారవుతున్న ఆర్టోస్‌ కొత్త బాటిల్స్‌

శతవసంతాల ‘ఆర్టోస్‌’

ఎన్నేళ్లయినా ఈ శీతల పానీయానికి అదే క్రేజ్‌

ఉగాది పర్వదినాన ప్రారంభమైన రెండో యూనిట్‌  

ఆర్టోస్‌.. ఇది పక్కా లోకల్‌.. ఈ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్‌’ వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.  

రామచంద్రపురం: ‘ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్‌! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది’ అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. ‘ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం’ అనే స్థాయిలో ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే.

మూడు తరాల కృషి 
ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి స్పేర్‌ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగి, అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

1955లో ఇంగ్లండ్‌ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్‌ మెషీన్‌ రప్పించారు. డ్రింక్స్‌కు ‘ఆర్టోస్‌’గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్‌ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్‌ వాటర్‌ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

వందేళ్ల తరువాత రెండో యూనిట్‌ 
ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో..
వందేళ్లుగా గోదావరి ప్రజలు ఆదరిస్తున్న ఆర్టోస్‌ను మరిన్ని రుచులతో అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రెండో యూనిట్‌ ప్రారంభించాం. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యంత్రాలను అమర్చి బాటిల్‌ యూనిట్‌ ఏర్పాటు చేశాం. గతంలో కంటే మరింత వేగంగా ఆర్టోస్‌ డ్రింక్‌ను వినియోగదారులకు అందించే ప్రయత్నంలో భాగంగానే రెండో యూనిట్‌ ప్రారంభించాం.
– అడ్డూరి జగన్నాథవర్మ, ఆర్టోస్‌ అధినేత 

చదవండి:
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..  
చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి

మరిన్ని వార్తలు