-
ఉదయం 8 నుంచి సాయంత్రం
4 గంటల వరకు పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం జరగనున్న రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు శుక్రవారం ప్రచారం ముగిసిందని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎన్నికల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ఎటపాక, పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే జరుగుతుందని వివరించారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీచేస్తున్నారని, 17,467 మంది ఓటర్లుండగా 116 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా–గుంటూరు స్థానానికి 19 మంది బరిలో ఉన్నారని, 13,505 మంది ఓటర్లుండగా 111 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు.