ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్‌

6 Sep, 2023 13:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కే. విజయానంద్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు.

ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్‌ తెలిపారు.
చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే

ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు