ఏపీ హైకోర్టులో 18 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ

18 Mar, 2021 05:26 IST|Sakshi
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు

నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌లో ఏపీకి చెందిన 13 పట్టణాలు

రాజ్యసభలో కేంద్రం వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 18, తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీచేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు మంజూరు కాగా 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యురాలు జోత్య్స చంద్రస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం లోక్‌సభలో ఈ సమాధానమిచ్చారు. వైఎస్సార్‌ సీపీ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 పట్టణాలను చేర్చినట్టు వివరించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్‌ నత్వానీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధా నంగా.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాష్‌ లోక్‌సభలో సమాధానమిస్తూ.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి విశాఖపట్నం నోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ పనులను రాష్ట్రం ప్రారంభించిందని తెలిపారు.

వలస కార్మికుల కోసం అద్దె ఇళ్ల సముదాయాలు
వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ల సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. దేశంలో ఎంఆర్‌వో సేవలను విస్తృత పరిచేందుకు ఎయిర్‌ బస్, బోయింగ్‌ సంయుక్తంగా జీఎంఆర్, ఎయిర్‌ వర్క్స్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు