టీఎస్‌ఐసెట్‌లో ఏపీ విద్యార్థుల జోరు

24 Sep, 2021 10:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 టాప్‌ 20 ర్యాంకుల్లో నలుగురు 

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్‌ఐసెట్‌ చైర్మన్‌ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.లోకేష్‌ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొట్ల ఆనంద్‌పాల్‌–కృష్ణా జిల్లా(149.94369 మార్కులు), అర్వలక్ష్మి జాహ్నవి–తూర్పుగోదావరి జిల్లా(140.99397 మార్కులు), వినీల్‌రెడ్డి – కర్నూలు జిల్లా(140.06698 మార్కులు), ఎం.ధ్రువకుమార్‌రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా(137.50799 మార్కులు) వరుసగా 5, 13, 16, 20 ర్యాంకులను సాధించారు.

మరిన్ని వార్తలు