31 కేసులు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు
సాక్షి, అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా 77 హోల్సేల్, రిటైల్ ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆయా షాపుల్లో ఈ–పోస్ యంత్రంలో పేర్కొన్న నిల్వలకు, బుక్ బ్యాలెన్స్లో ఉన్న నిల్వలకు పొంతన లేకపోవడం, ఓ–ఫారం లేకుండా ఎరువుల విక్రయం, స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయించడం, బిల్లు పుస్తకాలు, స్టాక్ బోర్డులు నిర్వహించకపోవడం తదితర అవకతవకలు జరుగుతున్నట్లుగా గుర్తించారు.
ఈ మేరకు రూ.29.14 లక్షల విలువైన 243.192 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకుని 18 కేసులు నమోదు చేశారు. అలాగే రూ.7.10 లక్షల విలువైన 92 టన్నుల ఎరువులను సీజ్ చేసి రెండు కేసులు నమోదు చేశారు. రూ.19.37లక్షల విలువైన 965 లీటర్ల పురుగుమందులను స్వాధీనం చేసుకుని 11 కేసులు నమోదు చేశారు. మరో రూ.2.96లక్షల విలువైన 105.95 కేజీల ఘన పురుగుల మందు నిల్వలను సీజ్చేశారు.