23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు: విజయబాబు

22 Aug, 2023 17:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో  ఘనంగా నిర్వహిస్తాం. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని పేర్కొన్నారు.

సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని  గుర్తించి సముచిత స్థాయిలో సత్కరిస్తాం. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా  రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23వ తేదీ  ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ  వారోత్సవాలు ప్రారంభమౌతాయి.  29 వ తేదీ  మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి.

24వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో, 25వ తేదీ  మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్‌లో, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, 27 వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని విజయబాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు