‘పంచాయతీ’ ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ జోరు.. బాబు, బాలయ్య, జేసీ ఇలాకాలో టీడీపీకి చేదు అనుభవం

20 Aug, 2023 05:10 IST|Sakshi

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కొనసాగిన ప్రభంజనం 

66 సర్పంచ్‌ పదవుల్లో ఏకగ్రీవాలతో కలిపి 53 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు 

10 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన విజయం

రెండు చోట్ల ఎన్నిక వాయిదా.. 

1,062 వార్డుల్లో 756 ఏకగ్రీవం, ఎన్నికలు జరిగినవి 243, జరగనివి 63 

మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 810, టీడీపీ 182, జనసేన 7 వార్డుల్లో విజయం

కుప్పం ఆరింటికి ఐదు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల జయకేతనం

ఎన్నిక ఏదైనా ఫ్యాన్‌ గాలికి ఎదురులేదని మరోసారి రుజువు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది.  రాష్ట్రంలో ఫ్యాన్‌ స్పీడ్‌కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచా­యతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్‌ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్‌ పదవులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే దక్కాయి.

మిగిలిన 34 సర్పంచ్‌ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్‌సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు.

తాజా గెలుపుపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్‌ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు గెలుపొందారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. 
  
జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. 
► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్‌ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. 

► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్‌సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. 

► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. 

► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్‌సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. 

► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్‌ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్‌సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 

► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 

► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. 

► డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. 

► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్‌సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. 

► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. 

► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్‌ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. 

► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. 

► ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు సర్పంచ్‌ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్‌సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. 

► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్‌ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్‌సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 

► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్‌సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. 

► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్‌ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్‌సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్‌సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు.  

► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్‌సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 

► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్‌సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. 

► తిరుపతిలో ఒక సర్పంచ్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. 

► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్‌సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 

► కర్నూలులో ఒక సర్పంచ్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్‌సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 

► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్‌ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్‌సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. 

► నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్‌ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్‌సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. 

► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్‌ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.
 
► వైఎస్సార్‌ జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 

► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్‌సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. 
 
కుప్పంలో చంద్రబాబుకు పరాభవం  
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు.  

మరిన్ని వార్తలు