తెనాలిరూరల్: ప్రేమ పేరుతో వంచించి మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసి పరారైన మహారాష్ట్ర యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.రమేష్ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మైనర్ బాలిక షరాఫ్ బజారులోని వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు బంగారు ఆభరణాల తయారీ పనులు చేసేందుకు తెనాలి వచ్చి షరాఫ్ బజార్ ప్రాంతంలోనే గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరిలో సోలాపూర్కు చెందిన ప్రశాంత్ జగదీష్ ఫడత్రే అలియాస్ ప్రశాంత్ ఫడత్రేకు బాలికతో స్నేహం ఏర్పడింది. తనను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భందాల్చగా విషయం తెలుసుకున్న అతడు తెనాలి విడిచి పరారయ్యాడు. మోసపోయిన బాలిక జనవరి 29న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించారు. సీఐ జి. దశరథరామారావు నేతృత్వంలో ఎస్ఐ వై. సుబ్బయ్య, ఏఎస్ఐ కె. రత్నరాజు, కానిస్టేబుల్ ఎస్కేఎండీ షరీఫ్ల బృందం యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడు గుజరాత్లోని భావనగర్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని తెనాలి తీసుకువచ్చారు. సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు సమర్ధవంతంగా పని చేసిన అధికారులు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
గుజారాత్లో అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు