ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌

10 Dec, 2023 19:21 IST|Sakshi

సరకు రవాణా చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.  2025 అక్టోబర్ 1, ఆ తర్వాత తయారయ్యే ఎన్‌2, ఎన్‌3 కేటగిరి ట్రక్కులలో డ్రైవర్‌ల కోసం ఏసీ క్యాబిన్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

3.5 టన్నుల నుంచి 12 టన్నులు బరువుండే ట్రక్కులు ఎన్‌2 కేటగిరీ కిందకు, 12 టన్నులు దాటిన ట్రక్కులు ఎన్‌3 కేటగిరీ కిందకు వస్తాయి. డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేసేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత జులైలోనే తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటైన రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని పరిస్థితులు, మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు