సిరాజ్‌ పెర్ఫార్మెన్స్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. కార్‌ ఇచ్చేయండి సార్‌..

17 Sep, 2023 17:14 IST|Sakshi

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్‌-2023 (Asia Cup) ఫైనల్‌ మ్యాచ్‌ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్‌ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్‌అవుట్‌ అయింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్‌ భారత్‌ వశమైంది. 

కాగా మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్‌ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్‌ బ్యాంటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్‌లో భారత​ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లు సాధించాడు.

మహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ పెట్టారు. సిరాజ్‌ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్‌ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్‌​ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్‌ సిరాజ్‌కు ఎస్‌యూవీ గిఫ్ట్‌ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు