డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!

20 Dec, 2021 18:55 IST|Sakshi

డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలోని 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్సెస్, గణితం & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారత దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా అవసరం లేదు. రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు గ్రాంట్ అందనుండగా, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. 

రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందిస్తే, మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు. 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న 76 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో ఉన్న టాప్ సైన్స్ & ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ లింకు మీద క్లిక్ చేయండి. 

(చదవండి: ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!)

మరిన్ని వార్తలు