ఆడి.. ఎలక్ట్రిక్‌ రైడ్‌

23 Jul, 2021 00:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి భారత్‌లో ఎలక్ట్రిక్‌ రైడ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ–ట్రాన్‌ శ్రేణిలో మూడు రకాల పూర్తి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. వీటిలో ఈ–ట్రాన్‌ 50, ఈ–ట్రాన్‌ 55, ఈ–ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌–55 మోడళ్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.99.99 లక్షల నుంచి రూ.1.18 కోట్ల వరకు ఉంది. ఈ–ట్రాన్‌ 55, ఈ–ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌–55 మోడళ్లకు 300 కిలోవాట్‌ పవర్, 664 ఎన్‌ఎం టార్క్‌తో డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ను బిగించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటాయి. ఇందులోని 95 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌ చేస్తే 359–484 కిలోమీటర్ల వరకు కారు ప్రయాణిస్తుంది. 230 కిలోవాట్‌ డ్యూయల్‌ మోటార్‌తో ఈ–ట్రాన్‌ 50 మోడల్‌ రూపుదిద్దుకుంది. దీనిలోని 71 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో వాహనం 264–379 కిలోమీటర్లు వెళ్తుంది. అంతర్జాతీయంగా 2025 నాటికి 20 రకాల ప్యూర్‌ ఎలక్ట్రిక్, 10 రకాల ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ మోడళ్లను పరిచయం చేయాలన్నది ఆడి లక్ష్యం. వీటిలో కొన్ని భారత్‌లోనూ అడుగుపెట్టనున్నాయి.

మరిన్ని వార్తలు