New Rules: అక్టోబర్‌ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..

23 Sep, 2023 17:55 IST|Sakshi

మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్‌ వంటి  ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్‌లైన్‌ సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్‌లకు నామినీల చేర్పు
ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్‌లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్‌ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు)

కొత్త టీసీఎస్‌ నియమాలు
క్రెడిట్ కార్డ్‌లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్‌ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్‌ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్
కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్‌, డీమ్యాట్ ఖాతాల అసెస్‌మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్‌డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్‌లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్‌లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి.

రూ. 2,000 నోట్ల మార్పిడి
రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి.

 

బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి
ఆధార్‌ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్‌ డాక్యుమెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

మరిన్ని వార్తలు