కంప్యూటర్లు, బంగారం, యూరియా... వీటి దిగుమతులపై కేంద్రం నజర్‌

12 Nov, 2021 13:21 IST|Sakshi

102 ఉత్పత్తులపై వాణిజ్య శాఖ దృష్టి 

వీటి దిగుమతుల్లో ఏటేటా వృద్ధి 

దేశీయంగా ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు 

వివిధ శాఖలకు జాబితా అందజేత 

 

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోతున్న ఉత్పత్తుల జాబితాను కేంద్రంలోని వివిధ శాఖలకు వాణిజ్య శాఖ అందజేసింది. కోకింగ్‌ కోల్, కొన్ని రకాల మెషినరీ, రసాయనాలు, డిజిటల్‌ కెమెరాలు ఇలా మొత్తం మీద 102 ఉత్పత్తులను గుర్తించింది. స్థానికంగానే వీటి ఉత్పత్తిని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని కోరింది. తద్వారా దిగుమతులను తగ్గించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగుమతుల బిల్లును తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర వాణిజ్య శాఖ ఈ ఉత్పత్తులకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం కూడా నిర్వహించింది. దీర్ఘకాలం నుంచి వీటి దిగుమతులు క్రమంగా పెరుగుతూనే ఉన్నట్టు గుర్తించింది. 

2021 మార్చి నుంచి ఆగస్ట్‌ వరకు దేశ దిగుమతుల బిల్లులో ఈ 102 ఉత్పత్తుల వాటానే 57.66 శాతంగా ఉన్నట్టు తెలుసుకుంది. బంగారం, ముడి పామాయిల్, ఇంటెగ్రేటెడ్‌ సర్క్యూట్లు, పర్సనల్‌ కంప్యూటర్లు, యూరియా, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్క్రాప్, శుద్ధి చేసిన రాగి, కెమెరాలు, పొద్దుతిరుగుడు నూనె, ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ కూడా వీటిల్లో ఉన్నాయి. 2021 ఏప్రిల్‌–అక్టోబర్‌ వరకు దేశ దిగుమతుల బిల్లు 331 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం అధికంగా ఉంది.
 

>
మరిన్ని వార్తలు