-

‘దేవుడు నోరిచ్చాడు కదా అని’.. అశ్నీర్‌ గ్రోవర్‌పై కోర్టు ఆగ్రహం!

28 Nov, 2023 15:55 IST|Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే మాజీ కో-ఫౌండర్‌ అశ్నీర్‌ గ్రోవర్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటికి ఏది వస్తే అది సోషల్‌ మీడియాలో మాట్లాడొద్దని సూచించింది. క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.2లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 

అశ్నీర్‌ గ్రోవర్‌ భారత్‌పే గురించి ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆపోస్టులపై భారత్‌పే ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో అశ్నీర్‌ తమ సంస్థను కించ పరుస్తూ పోస్టులు పెడుతున్నారని, భవిష్యత్‌లో అలాంటి పోస్టులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా భారత్‌పే పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. అయితే, భవిష్యత్‌లో అశ్నీర్‌ పెట్టే సోషల్‌ మీడియా పోస్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచింది. క్షమాపణలు చెప్పడంతో పాటు, రూ.2లక్షల ఫైన్‌ కట్టాలని తీర్పు వెలువరించింది. 

గత వారం అశ్నీర్‌ గ్రోవర్‌ భారత్‌పే ఈక్విటీ, సిరీస్‌ ఈ ఫండింగ్‌ గురించిన సమాచారాన్ని ఎక్స్‌లో పోస్ట్‌లో చేశారు. ఆ పోస్ట్‌లో టైగర్‌ గ్లోబుల్‌, డ్రాగోనీర్ ఇన్వెస్టర్ గ్రూప్‌తో పాటు ఇతర సంస్థలు భారత్‌పేలో 370 మిలియన్ల పెట్టుబడుల్ని పెంచాయని, ఫలితంగా ఆ సంస్థ విలువ 2.86 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను అశ్నీర్‌ డిలీట్‌ చేశారు. దీనిపై భారత్‌పే ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో అశ్నీర్‌ పోస్ట్‌లు పెట్టకుండా నిషేధించాలని కోరింది. దీనిని ఢిల్లీ కోర్టు వ్యతిరేకించింది. 

కాకపోతే, అశ్నీర్‌ గ్రోవర్‌ ప్రవర్తన దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు అతనికి హెచ్చరికలతో సరిపెట్టింది. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు నిబంధనల్ని ఉల్లంఘిస‍్తే చర్యలు తీసుకుంటామని సూచించింది.

మరిన్ని వార్తలు