-

ఎలక్ట్రిక్ బైక్‌ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు

23 Jun, 2022 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఎలక్ట్రిక్  బైక్స్‌ వరుస అగ్నిప్రమాద ఘటనలపై కేంద్రం స్పందించింది.  దీనిపై 15 రోజుల్లో  వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల ఘటనలను సుమోటోగా  స్వీకరించిన కేంద్రం, అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాల వివరణ ఇవ్వాలని వినియోగదారుల పర్యవేక్షణ సంస్థ ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌కు  నోటీసులు జారీ చేసింది.  

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవలి ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాద సంఘటనలపై ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసు జారీ చేసిందని సీఎన్‌బీసీ  రిపోర్ట్‌ చేసింది.  అలాగే ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్ వారి ఇ-స్కూటర్లు పేలడంతో  సీసీపీఏ గత నెలలో నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులకు స‍్పందించేందుకు  ఓలా ఎలక్ట్రిక్‌కు 15 రోజుల గడువు ఇచ్చింది. 

మరోవైపు తమ బ్యాటరీ సిస్టం ఇప్పటికే యూరోపియన్ స్టాండర్డ్ ఈసీఈ 136కి అనుగుణంగా ఉండటంతో పాటు దేశీయ తాజా ప్రతిపాదిత ప్రమాణం ఏఐఎస్‌ 156 కు అనుగుణంగా ఉందని  కంపెనీ తెలిపింది. 

కాగా  ఇటీవల, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు ఆందోళన రేపాయి. దీంతో తయారీ దారులు తమ వాహనాలను రీకాల్ చేసాయి. ఏప్రిల్‌లో, ఓలా ఎలక్ట్రిక్ 1 441యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్ని రీకాల్ చేసింది. అలాగే బూమ్ మోటార్స్ ఏప్రిల్ చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్‌తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పేలుడు సంభవించి 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తెలంగాణలోని నిజామాబాద్‌లో  ప్యూర్‌ ఈవీ స్కూటర్‌ బ్యాటరీ పేలుడు కారణంగా  80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.  దీంతో సుమారు 2,000 స్కూటర్లను రీకాల్ చేసింది.

ఇది ఇలా ఉంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ట్విటర్‌ షేర్‌ చేసిన  ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు  చేశారు. ఈవీ ప్రమాదాలు జరుగుతాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ  అగ్నిప్రమాదాలు జరుగుతాయి. కానీ ఐసీఈ ప్రమాదాలతో పోలిస్తే ఈవీల్లో  తక్కువని ఆయన ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు