19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్‌ కో-ఫౌండర్

30 Sep, 2023 15:17 IST|Sakshi

భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎవరికి వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి.. కొత్త కొత్త ఆలోచనలతో బాగా సంపాదిస్తూ కోటీశ్వరుగా మారుతున్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు EaseMyTrip ట్రావెల్ వెబ్‌సైట్ కో-ఫౌండర్ 'రికాంత్ పిట్టి'. ఈయన ఇటీవల ఖరీదైన 'లంబోర్ఘిని' కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే (Lamborghini Urus Performante)
నివేదికల ప్రకారం.. రికాంత్ పిట్టి కొనుగోలు చేసిన కారు 'లంబోర్ఘిని' కంపెనీకి చెందిన 'ఉరుస్ పెర్ఫార్మంటే'. దీని ధర రూ. 4.2 కోట్లు కావడం గమనార్హం. మన దేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు బాగా ఇష్టపడే కార్ల జాబితాలో ఇది ఒకటి.

ఈ కారు కొనుగోలు చేసిన సందర్భంగా రికాంత్ లింక్డ్‌ఇన్‌లో చాలా పెద్ద పోస్ట్‌ షేర్ చేసాడు. ఇందులో అతని 16 సంవత్సరాల వయస్సులో తన సోదరుడితో తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడో వివరించాడు. ఆ తరువాత 20 సంవత్సరాల వయసు నాటికి EaseMyTrip వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇది క్రమంగా వృద్ధిలోకి వచ్చింది. అనేక సంవత్సరాల కృషి తర్వాత, ఈజీమైట్రిప్‌ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీగా అవతరించింది.

లంబోర్ఘిని కారుని సొంతం చేసుకోవడం 19 ఏళ్లప్పుడు కన్న కల అని  రికాంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే 2021లో ఈ కారుని కొనుగోలు చేసి ఉండొచ్చని, ఆ సమయంలో కరోనా బాధితుల సహాయం కోసం నిధులను ఉపయోగించడం వల్ల అది కుదరలేదని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇది కేవలం కారు మాత్రమే కాదు, మన కష్టార్జితాన్ని, మనం సాకారం చేసుకున్న కలలను, వెంటాడుతున్న కలలను సూచిస్తుందని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో

ఇక లంబోర్ఘిని విషయానికి వస్తే, ఇది 2022లో దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది 4.0-లీటర్ V8, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌ కలిగి 666 పీఎస్ పవర్ & 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ SUV దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

మరిన్ని వార్తలు