ఈవీల తయారీకి భారత్ చైనావైపు చూడాల్సిందేనా? జిటిఆర్ఐ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!

7 Mar, 2023 20:34 IST|Sakshi

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కూడా అందిస్తున్నాయి. ఈవీల ఉత్పత్తి, వినియోగం పెరుగుతున్నప్పటికీ వాటి తయారీకి కావలసిన ముడిపదార్ధాలు మనదేశంలో పుష్కలంగా లేదు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కావాలసిన ముడిపదార్ధాలకోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, మినరల్ ప్రాసెసింగ్, బ్యాటరీ వంటి వాటికోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతోంది.

భారతదేశంలో ఈవీల తయారీకి ఉపయోగించే 70 శాతం పదార్థాలు చైనా నుంచి మరికొన్ని ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో అతిపెద్ద లిథియం గనులను చైనా తన సొంతంచేసుకుంది. కావున ప్రపంచంలోని చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి చైనా వైపు చూస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న నాలుగు బ్యాటరీలలో చైనా మూడింటిని తయారు చేస్తుంది. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఈవీల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇది కొనుగోలుదారులమీద కూడా ఎక్కువ ప్రభావము చూపుతోంది.

(ఇదీ చదవండి: భారత్‌లో ఆల్కజార్ కొత్త వేరియంట్ లాంచ్: త్వరలో డెలివరీలు)

సాధారణ 500 కేజీల లిథియం కార్ బ్యాటరీ 12 కేజీల లిథియం, 15 కేజీల కోబాల్ట్, 30 కేజీల నికెల్, 44 కేజీల రాగి, 50 కేజీల గ్రాఫైట్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇది దాదాపు 200 కేజీల స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్‌ వంటి వాటిని కూడా ఉపయోగిస్తోంది. బ్యాటరీ కనీస జీవిత కాలం 6 నుంచి 7 సంవత్సరాలు. ఆ తరువాత దీనిని రీసైకిల్ చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి చైనా చాలా అవసరం అని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు