కోవిడ్‌ కాలంలోనూ తగ్గని సాఫ్ట్‌వేర్‌ సేవలు 

21 Sep, 2021 03:26 IST|Sakshi

2020–21లో ఎగుమతులు 2 శాతంపైగా పెరుగుదల

విలువలో 148 బిలియన్‌ డాలర్లు

ముంబై: కోవిడ్‌–19 సమయంలో అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులు (భారత్‌ కంపెనీల విదేశీ అనుబంధ విభాగాల సేవలనూ కలుపుకుని) 2.1 శాతం పెరిగాయి. విలువలో 148.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్వే ఒకటి తెలిపింది. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సమాచార సాంకేతికత ఆధారిత సేవల (ఐటీఈఎస్‌)

వార్షిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
భారత్‌ కంపెనీల విదేశీ అనుబంధ విభాగాల సేవలను కలుపుకోకుండా పరిశీలిస్తే, ఎగుమతుల విలువ 4 శాతం పెరిగి 134 బిలియన్‌ డాలర్లుకు పెరిగింది.  
మొత్తం ఎగుమతుల్లో కంప్యూటర్‌ సేవల వాటా 65.4 శాతంకాగా, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సమాచార సాంకేతికత ఆధారిత సేవల  (ఐటీఈఎస్‌) వాటా 34.7 శాతం. ఇందులో (ఐటీఈఎస్‌)లో బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ ప్రధాన వాటా ఉంది.  
సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల వాటా 50% కన్నా అధికంగా ఉంది. 
సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌ వాటాలో మొదటి స్థానంలో అమెరికా (54.8 శాతం) ఉంది. యూరోప్‌ వాటా 30.1 శాతం. ఇందులో సగం వాటా కేవలం బ్రిటన్‌ది కావడం గమనార్హం.  
సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ప్రధాన ఇన్‌వాయిసింగ్‌ కరెన్సీలో అమెరికా డాలర్‌ వాటా 72 శాతం. యూరో, పౌండ్‌ స్టెర్లింగ్‌ వాటా 15.9 శాతం.  
6,115 సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి కంపెనీలను ఈ సర్వేకోసం సంప్రదిస్తే, 1,815 కంపెనీలు మాత్రమే ప్రతిస్పందించాయి. వీటిలో పెద్ద కంపెనీలే అధికంగా ఉన్నాయి. అయితే మొత్తం సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కేవలం వీటి వాటానే 86.5 శాతం కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు