క్రెడిట్‌ కార్డు.. కొంచెం కష్టమే!

17 Nov, 2023 04:55 IST|Sakshi

ఆర్‌బీఐ కొత్త నిబంధనలు  

ముంబై: క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి  అన్‌సెక్యూర్డ్‌  రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ  విషయమై బ్యాంకులకు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  ఆదేశాలు జారీ చేసింది. అన్‌సెక్యూర్డ్‌ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్‌ జాగరూకత పాటించడం ఆర్‌బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్‌ వెయిటేజ్‌  అన్‌సెక్యూర్డ్‌ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం.

అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్‌ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్‌ మరింత ఖరీదైనదిగా మారడంతో  ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్‌ కార్డ్‌ రుణాలపై రిస్క్‌ వెయిటేజ్‌ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్‌బీఎఫ్‌సీలపై 125 శాతానికి పెరుగుతుంది.  కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్‌ బ్యాంక్‌ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.  2023 సెపె్టంబర్‌ చివరి నాటికి పర్సనల్‌ లోన్‌ల విభాగంలో బ్యాంక్‌ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు.  ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. 

మరిన్ని వార్తలు