Gita Gopinath: 'ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ'..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

7 Jul, 2022 14:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్‌ మొదటి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ మరో అరుదైన గుర్తింపును పొందారు. ఐఎంఎఫ్‌ ‘వాల్‌ ఆఫ్‌ ఫార్మర్‌ చీఫ్‌ ఎకనమిస్ట్స్‌’పై ఆమెకు చోటు లభించింది. ఈ గొప్ప స్థానాన్ని సంపాదించిన మొదటి మహిళ గీతా గోపీనాథ్‌కాగా, ఈ స్థానానికి చేరిన భారత్‌ సంతతికి చెందిన రెండవ వ్యక్తి. ఇంతక్రితం రఘురామ్‌ రాజన్‌ ఈ గౌరవం లభించింది.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ 2003  నుంచి 2006 మధ్య ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గీతా గోపీనాథ్, 2018 అక్టోబర్‌లో ఐఎంఎఫ్‌ మొట్టమొదటి మహిళా చీఫ్‌ ఎకనమిస్టుగా నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఐఎంఎఫ్‌ మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. గోపీనాథ్‌ పరిశోధనలు అనేక అగ్ర ఆర్థిక శాస్త్ర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

 ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌గా నియామకానికి ముందు ఆమె హార్వర్డ్‌ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో అంతర్జాతీయ అధ్యయనాలు,  ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.2005లో హార్వర్డ్‌ యూనివర్శిటీ ఫ్యాకల్టీలో చేరడానికి ముందు, ఆమె యూనివర్శిటీ ఆఫ్‌ చికాగోలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎకనామిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 

బ్రేకింగ్‌ ది ట్రెండ్‌ 
‘ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ, నేను ఐఎంఎఫ్‌ మాజీ చీఫ్‌ ఎకనామిస్ట్‌ల గోడపై చేరాను’ అని గీతా గోపీనాథ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.   మాజీ చీఫ్‌ ఎకనామిస్ట్‌ల గోడపై నెలకొలి్పన తన ఫొటో వద్ద ఫోజిచ్చిన్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్వీట్‌కు జోడించారు.    

మూడేళ్ల పాటు 
ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్‌ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వ‌ర్డ్ వ‌ర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మరిన్ని వార్తలు