రూ.1,16,200 కోట్లకు వాహన విడిభాగాల విపణి

5 Feb, 2024 01:55 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన విక్రయానంతర విడిభాగాల మార్కెట్‌ దేశీయంగా 2028 నాటికి రూ.1,16,200 కోట్లకు చేరుకుంటుందని ఒక నివేదిక వెల్లడించింది. వాహన విక్రయాల్లో భారీ వృద్ధి ఇందుకు కారణమని తెలిపింది. 2023లో ఇది రూ.83,000 కోట్లు ఉంది. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ భాగస్వామ్యంతో ఆటోమోటివ్‌ కంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏసీఎంఏ) ఈ నివేదిక రూపొందించింది.

‘ప్రస్తుతం భారతీయ రోడ్లపై 34 కోట్ల వాహనాలు పరుగెడుతున్నాయి. ఈ సంఖ్య వచ్చే అయిదేళ్లలో ఏటా వార్షిక సగటు వృద్ధి 8 శాతం నమోదు కానుంది. 2028 నాటికి ద్విచక్ర వాహనాలు 25.7 కోట్ల నుంచి 36.5 కోట్లకు, ప్యాసింజర్‌ వాహనాలు 4.7 కోట్ల నుంచి 7.2 కోట్లకు చేరనున్నాయి. ప్రీ–ఓన్డ్‌ కార్ల విక్రయాల సగటు వృద్ధి 2027–28 నాటికి ఏటా 17.5 శాతం ఉంటుంది. వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.9 కోట్లను తాకనుంది.

ట్రాక్టర్లు 1.4 కోట్ల నుంచి 1.9 కోట్లకు చేరనున్నాయి. ఇక్కడి కంపెనీలకు టాప్‌–10 అంతర్జాతీయ మార్కెట్లకు రూ.2,90,500 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు లభిస్తాయి. ఇంజన్, సస్పెన్షన్, బ్రేకింగ్, ట్రాన్స్‌మిషన్‌ పార్ట్స్, రబ్బర్‌ విడిభాగాలు, కూలింగ్‌ సిస్టమ్స్, ఫిల్టర్స్‌కు ప్రధానంగా డిమాండ్‌ ఉంటుంది’ అని నివేదిక వివరించింది. టైర్లు, లూబ్రికెంట్స్, కూలెంట్స్, బ్యాటరీలను నివేదికలో పొందుపర్చలేదు.  

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega