ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్‌ ప్రపంచంలోనే..

2 Nov, 2023 10:41 IST|Sakshi

గత కొన్ని రోజులకు ముందు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నారాయణ మూర్తి' చేసిన వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు ఈ వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరి కొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ దేశంలో ఎక్కువ పనిగంటలు ఉన్నాయనే వివరాలను 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. భారతదేశంలో ప్రతి ఉద్యోగి వారానికి సగటున 47.7 గంటలు పనిచేస్తాడు. ప్రపంచంలో ఎక్కువ కష్టపడే ఉద్యోగులలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది. చైనాలోని ఉద్యోగులు వారానికి 46.1 గంటలు పనిచేస్తూ జాబితాలో రెండవ స్థానం పొందారు. ఫ్రాన్స్ ఉద్యోగులు వారానికి కేవలం 30.1 గంటలు మాత్రమే అని డేటా చెబుతోంది.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇటీవల సూచించిన వారానికి 70 గంటల పని.. భారతదేశాన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోటీపడేలా చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు​, జపనీయులు అదనపు పనిగంటలు చేయడం ప్రారంభించారని మూర్తి వెల్లడించారు. జిందాల్, భవిష్ అగర్వాల్ వంటి ప్రముఖులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..

సుదీర్ఘ పని గంటలను గురించి ప్రస్తావించిన మొదటి వ్యక్తి నారాయణ మూర్తి కాదు, గతంలో ఒక సారి బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే కూడా ఇదే విషయం మీద తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అతని మాటలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలవడంతో చివరకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది.

మరిన్ని వార్తలు