జేఎస్‌డబ్ల్యూతో ఎస్‌ఏఐసీ జత

2 Dec, 2023 06:27 IST|Sakshi

ఎంజీ మోటార్‌ ఇండియాకు దన్ను

న్యూఢిల్లీ: చైనా ఆటో రంగ దిగ్గజం ఎస్‌ఏఐసీ మోటార్‌.. దేశీ మెటల్‌ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ దేశీయంగా ఎంజీ మోటార్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోపాటు.. వృద్ధికి సహకరించనుంది. లండన్‌లో జరిగిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ 35 శాతం వాటాను పొందనున్నట్లు తెలుస్తోంది. దేశీ వినియోగదారునిపై దృష్టితో నవతరం టెక్నాలజీ, ప్రొడక్టుల ద్వారా మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించేందుకు జేవీకి ఎస్‌ఏఐసీ మద్దతివ్వనుంది.

అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీలో జేఎస్‌డబ్ల్యూ 35 శాతం వాటా తీసుకోనుందా లేక ఎస్‌ఏఐసీ మోటార్‌ సొంత అనుబంధ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియాలో పొందనుందా అనే విషయంపై రెండు కంపెనీల నుంచీ స్పష్టతలేకపోవడం గమనార్హం. ఒకప్పటి బ్రిటిష్‌ బ్రాండ్‌ ఎంజీ మోటార్‌ను ప్రస్తుతం షాంఘై దిగ్గజం ఎస్‌ఏఐసీ మోటార్‌ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న ఐదేళ్ల కాలపు ప్రణాళికలో భాగంగా దేశీ కంపెనీలకు 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను ఆఫర్‌ చేయనున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. తదుపరి దశ వృద్ధికి వీలుగా ఎంజీ మోటార్‌ నిధుల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరిన్ని వార్తలు