క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు

22 Mar, 2024 11:30 IST|Sakshi

మారుతున్న జీవనప్రమాణాల కారణంగా చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సమయానికి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడం, ఆఫ్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం, కరెంట్‌ బిల్లులు పే చేయడం, పెట్రోల్‌బంక్‌లో స్వైప్‌ చేయడం.. వంటి చాలాపనులకు నిత్యం క్రెడిట్‌కార్డులు వాడుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేకకార్డుల్లో ఆయా క్రెడిట్‌కార్డు సంస్థలు రివార్డు పాయింట్లు ఇస్తూంటాయి. వాటిని క్లెయిమ్‌ చేసుకుని ఇతర వస్తువులు వంటివి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంక్‌లు అందిస్తున్న క్రెడిట్‌కార్డు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల  ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తుంది. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ అందిస్తున్న ఆరమ్‌, ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌

కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌, మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. 

యస్‌ బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ తరహాలోనే యస్‌ బ్యాంక్‌ కూడా లాంజ్‌ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్‌ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ

యాక్సిస్‌ బ్యాంక్‌ 

మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రివార్డ్‌ పాయింట్లు, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్‌/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్‌ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Election 2024

మరిన్ని వార్తలు