ఉద్యోగం వదిలి అద్దె భూమిలో వ్యవసాయం.. కోట్లు గడిస్తూ కాలర్ ఎగరేస్తున్నాడు!

21 Apr, 2023 18:26 IST|Sakshi

MBA Graduate Rajeev Bhaskar: నిజానికి సక్సెస్ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఆలాంటి సక్సెస్ రావడానికి నిరంతరం కష్టపడాలి. ఆ కష్టమే మనిషిని విజయపథంలో ముందుకు తీసుకెళుతుంది. వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న గ్రాడ్యుయేట్స్‌లో ఒకరు రాజీవ్ భాస్కర్. ఇంతకీ ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి? దీని కోసం ఎంతలా కష్టపడ్డానే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

విఎన్ఆర్ సీడ్స్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్‌గా పనిచేసిన రాజీవ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. సీడ్స్ కంపెనీలో అతనికి ఏర్పడిన అనుభవమే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది, అంతే కాకుండా వ్యవసాయం మీద అతనికి ఆసక్తిని ఏర్పరచింది.

వ్యవసాయంలో కొత్త పోకడలను తెలుసుకుని కొత్తగా వ్యవసాయం చేయడం మొదలెట్టిన రాజీవ్ థాయ్ జామ రకం పంటలు పండిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 2017లో తన ఉద్యోగాన్ని వదిలి హర్యానాలోని పంచకులలో ఐదు ఎకరాల భూమిని అద్దెకు తీసుకుని జామ పండించడం ప్రారంభించాడు.

రాజీవ్ భాస్కర్ పంటల పెరుగుదలను ప్రోత్సహించడానికి సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన బయోసైడ్లు, బయోఫెర్టిలైజర్లను ఉపయోగించాడు. పంటను పురుగులు, కీటకాల బారి నుంచి రక్షించడానికి మూడు పొరల బ్యాగింగ్ టెక్నిక్‌ ఉపయోగించాడు. ఇది వ్యవసాయాభివృద్ధికి బాగా దోహదపడింది.

(ఇదీ చదవండి: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!)

తన మొదటి పంట 2017 అక్టోబరు & నవంబర్‌ మధ్య కాలంలో చేతికొచ్చింది. అప్పుడు అతడు రూ. 20 లక్షల వరకు సంపాదించాడు. ఆ తరువాత కూరగాయల పంటలను కూడా అదే పద్దతిలో పండించడం మొదలుపెట్టాడు. అయితే కూరగాయలను విక్రయించడంలో కొంత వెనుకపడ్డాడు, కానీ జామ పంటను అలాగే ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతడు 2019లో ముగ్గురు పెట్టుబడిదారులతో పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో సుమారు 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు.

(ఇదీ చదవండి: Toyota FJ Cruiser: ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?)

2019 తరువాత రాజీవ్, అతని బృందం పంజాబ్‌లో 25 ఎకరాల భూమిలో జామ చెట్లను నాటారు. అదే సమయంలో పంచకుల తోటలోని ఐదు ఎకరాలలో కూడా థాయ్ జామపండ్లను పండించడం కొనసాగించారు. రెండు విధాలుగా వర్షాకాలం, చలికాలంలో పంటలు పండిస్తూ భారీగా ఆర్జించడం మొదలుపెట్టారు.

రాజీవ్ తన జామ మొక్కల సగటు గరిష్ట దిగుబడిని మొక్కకు 25 కిలోల నుంచి 40 కిలోలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రసాయనాలు ఉపయోగించే కాలంలో సేంద్రియ వ్యవసాయం కొంత కఠినంగా ఉండనియూచెబుతున్నారు . అయినప్పటికీ అదే పద్దతిని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఉన్న ఉద్యోగం వదిలి వ్యవసాయంలోనే కోట్లు గడిస్తున్న రాజీవ్ ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. 

మరిన్ని వార్తలు