శ్రేయి కంపెనీలకు ఎన్‌ఏఆర్‌సీఎల్‌ అత్యధిక బిడ్‌

5 Jan, 2023 06:27 IST|Sakshi

రూ. 5,555 కోట్లకు దాఖలు

కోల్‌కతా: సంక్షోభంలోని రెండు శ్రేయి గ్రూప్‌ కంపెనీలను దక్కించుకునేందుకు నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) అత్యధికంగా రూ. 5,555 కోట్ల మేర ’ప్రస్తుత నికర విలువ’ ప్రాతిపదికన బిడ్‌ దాఖలు చేసింది. ఇందులో రూ. 3,200 కోట్లు నగదు రూపంలో ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 10 గంటల పాటు రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్వహించిన బిడ్డింగ్‌లో వర్దే పార్ట్‌నర్స్‌ కన్సార్షియం పక్కకు తప్పుకుంది.

ఎన్‌ఏఆర్‌సీఎల్‌ అత్యధికంగా బిడ్‌ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానికన్నా స్వల్పంగా వెనుకబడిన ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా ఇంకా బరిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రెండు సంస్థలు (ఎన్‌ఏఆర్‌సీఎల్, ఆథమ్‌) తమ సమగ్ర ప్రణాళికలను సీవోసీకి సమర్పిస్తాయని, జనవరి 8–9 మధ్య తుది ఓటింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం దివాలా పరిష్కార ప్రణాళిక దాదాపు రూ. 13,000–14,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కనిష్టంగా రూ. 9,500–10,000 కోట్లయినా రావచ్చని పేర్కొన్నాయి.  గవర్నెన్స్‌ లోపాలు, రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ల కారణంగా శ్రేయి గ్రూప్‌లోని శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ (ఎస్‌ఐఎఫ్‌ఎల్‌), దాని అనుబంధ సంస్థ శ్రేయి ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ (ఎస్‌ఈఎఫ్‌ఎల్‌) బోర్డులను రిజర్వ్‌ బ్యాంక్‌ రద్దు చేసింది. ఈ రెండు నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) .. బ్యాంకులకు రూ. 32,750 కోట్ల మేర బాకీ పడ్డాయి. వీటిని రాబట్టుకునేందుకు 2021 అక్టోబర్‌లో దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి.  

మరిన్ని వార్తలు