బిగ్‌ షాక్‌: ఈ ఓటీటీ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేయాలంటే, పైసలు కట్టాల్సిందే!

31 Oct, 2022 18:24 IST|Sakshi

గత సంవత్సర కాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ గడ్డు కాలాన్ని చవి చూస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్‌ పుంజుకున్న, నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకుంటూ డీలా పడింది. కొనసాగుతున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, OTTలో పెరుగుతున్న పోటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్‌ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్‌స్క్రైబర్లును కోల్పోయింది. అయితే దీని వెనుక ప్రధాన కారణాన్ని కనుగోంది. అదే యూజర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్ షేరింగ్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్‌ని తీసుకురాబోతోంది.

అదనపు చార్జ్‌ కట్టాల్సిందే!
గతంలో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు ఒక అకౌంట్‌కి నగదు చెల్లించి ఆ పాస్‌వర్డ్‌ ఇతరులకు షేర్‌ చేసేవాళ్లు. ఇకపై అలా కుదరదు. కస్టమర్లు తమ అకౌంట్లను ఇతర యూజర్లతో పంచుకోవాలంటే అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 నాటికి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సబ్‌స్క్రైబర్‌లు తమ అకౌంట్‌ పాస్‌వర్డ్‌లను ఇతర వినియోగదారులతో షేరింగ్‌ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలనే  విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ వసూలు చేసే అదనపు రుసుము $3 నుంచి $4 మధ్య ఉండబోతుంది.

కాస్త ఊపిరి పీల్చుకున్న నెట్‌ఫ్లిక్స్‌
నెట్‌ఫ్లిక్స్ మార్చి త్రైమాసికంలో దాదాపు 200,000 మంది,  జూన్ త్రైమాసికంలో దాదాపు 970,000 మంది సబ్‌స్క్రైబర్‌ కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మూడవ త్రైమాసిక ఆదాయ నివేదికలో, 2.41 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను పొందినట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కస్టమర్ల సంఖ్యను పెంపుతో పాటు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి, ఇటీవలే చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. తాజాగా 2022 మూడో త్రైమాసికంలో 2.4 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 

చదవండి: బ్యాంక్‌ కస్టమర్లకు ఊహించని షాక్‌.. ఈ లావాదేవీలపై..

మరిన్ని వార్తలు