New SIM Card Rules In 2024: దేశంలో కొత్త సిమ్‌ కార్డ్‌ రూల్స్‌!, నిబంధనలు అతిక్రమిస్తే 3ఏళ్ల జైలు శిక్ష.. ఇంకా

24 Dec, 2023 12:53 IST|Sakshi

దేశంలో పెరిగే పోతున్న సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది నుంచి సిమ్‌ కార్డ్‌ పొందేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ విధానాన్ని అంగీకరిస్తూ ప్రవేశ పెట్టిన టెలికమ్యూనికేషన్‌ బిల్‌-2023ను రాజ్యసభ, లోక్‌ సభ సభ్యులు ఆమోదించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమోద ముద్ర అనంతరం కొత్త సిమ్‌ కార్డ్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
      
మూడేళ్ల జైలు శిక్ష
టెలికమ్యూనికేషన్‌ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత నకిలీ సిమ్‌ కార్డ్‌ తీసుకున్న వినియోగదారుల్ని కఠినంగా శిక్షలు విధించే అవకాశం ఉంది. మూడేళ్లు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

కేవైసీ
జనవరి 1,2024 నుంచి సిమ్‌ కార్డ్‌ను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం  వినియోగదారులు కేవైసీ వివరాల్ని అందించాలి. ఇక సిమ్‌ కార్డ్‌ను అమ్మే డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు వెరిఫికేషన్‌ తప్పని సరి. పెద్ద సంఖ్యలో సిమ్‌కార్డ్‌లు అమ్మడాన్ని కేంద్రం నిషేధం విధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

బయోమెట్రిక్‌ తప్పని సరి
సాధారణంగా మనం ఆధార్‌ కార్డ్‌ను తీసుకునేందుకు ఎలా బయోమెట్రిక్‌ (వేలి ముద్రలు) ఇస్తామో, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమలయ్యే సిమ్‌ కార్డ్‌ నిబంధనల్లో భాగంగా ఎవరైతే సిమ్‌ కార్డ్‌ కొనుగోలు చేస్తారో వారు తప్పని సరిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ విధానంలో సైబర్‌ నేరస్తులు ఎక్కువ సిమ్‌ కార్డ్‌లను కొనుగోలు చేసే వీలుండదు. 

ఆమోదం తప్పని సరి
ఇకపై టెలికం ఫ్రాంచైజీ తీసుకున్నవారు, లేదంటే సిమ్‌ కార్డ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ఏజెంట్లు రిజిస్ట్రేషన్‌ తప్పని సరిగా చేసుకోవాలి. లేదని నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు