6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు

28 Oct, 2023 16:24 IST|Sakshi

చంద్రుడితో కనెక్ట్‌ అయ్యే అవకాశం!

వినియోగదారుల గోప్యతకు సెన్సింగ్ టెక్నాలజీ

న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్‌సీఆర్‌టీసీ, ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్‌వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది.

నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) దిల్లీ నుంచి మీరట్‌ రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కోసం ఒక ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్‌స్టోమ్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్‌టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్.

నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు