రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్‌ అంబానీ!

20 Dec, 2023 19:32 IST|Sakshi

ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కంపెనీ పేరు వాడుకోనేందుకు సదరు కంపెనీకి రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ  రూ.254 కోట్లు చెల్లించారు. 

గత ఏడాది డిసెంబర్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన ‘రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్స్‌’ జర్మనీ చెందిన మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. క్రయ, విక్రయ సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా మెట్రోకు చెందిన 31 హోల్‌సేల్‌ స్టోర్లు, 6 స్టోర్‌లలో ఉన్న స్థలాల్ని సైతం చేజిక్కించుకుంది. 

అయితే భారత్‌లో కొత్త యజమాని రిలయన్స్‌ వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా మెట్రో లైసెన్స్‌లు ఇచ్చింది. మెట్రో ఇండియా ఆస్తులతో పాటు ఆ పేరును వినియోగించుకునేందుకు రూ.254 కోట్లు చెల్లించింది. ఇకపై తన పేరును రియలన్స్‌ వాడుకోవచ్చని మెట్రో తన వార్షిక ఫలితాల విడుదల నివేదికలో తెలిపింది.  

2003లో అడుగు పెట్టి
జర్మనీ రీటైల్‌ సంస్థ మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్‌సేల్‌ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్‌ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది.


‘క్యాష్‌-అండ్‌-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. ఈ పద్దతిలో ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే ఈ మెట్రో స్టోర్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు.

>
మరిన్ని వార్తలు