సైబర్‌ కేటుగాళ్లు ఎంత దోచేశారంటే.. ప్రభుత్వం లెక్కలు!

20 Dec, 2023 11:17 IST|Sakshi

ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్‌, ఆర్థిక మోసాలు సైతం అదే స్థాయిలో పెగుతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్థిక సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. దేశంలో మూడేళ్లలో నమోదైన సైబర్‌, ఆర్థిక మోసాల కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా తెలియజేసింది.

12,000 మోసాలు.. రూ.461 కోట్లు
దేశవ్యాప్తంగా మూడేళ్లలో సైబర్‌, ఆర్థిక మోసాలు భారీగానే జరిగాయి. ‘కార్డ్/ఇంటర్నెట్/ఏటీఎం / డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు’ కేటగిరి కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం సుమారు 12,000 మోసాలు నమోదయ్యాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వీటి ద్వారా రూ.461 కోట్ల మేర బాధితులు మోసపోయారని పేర్కొంది.

ఇదీ చదవండి: రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్‌’కు చెక్‌.. ఆర్‌బీఐ నిబంధనలు కఠినతరం

మరోవైపు సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ మాడ్యూల్‌ ద్వారా ఈ ఏడాది డిసెంబర్‌ 14 నాటికి నాలుగు లక్షలకు పైగా ఘటనల్లో రూ. 1,000 కోట్లకుపైగా బాధితులు మోసపోకుండా కాపాడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ టెలికాం శాఖ అందించిన వివరాలను ఉటంకిస్తూ తెలిపారు. నకిలీ పత్రాలతో తీసుకున్నవి, అనుమానిత కనెక్షన్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల్లో ప్రమేయం ఉన్నవి దాదాపు 72 లక్షల మొబైల్ కనెక్షన్‌లను తొలగించినట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు