రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

10 Mar, 2023 00:47 IST|Sakshi

16 రుణదాతలకు రూ. 400 కోట్ల చెల్లింపు

న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌ 16 రుణదాత సంస్థలతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పూర్తిచేసుకున్నట్లు రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి తుది చెల్లింపుకింద రూ. 400 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. గడువుకంటే దాదాపు నెల రోజుల ముందుగానే  మార్చి 8న సెటిల్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు తెలియజేసింది.

2022 డిసెంబర్‌ 30న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెటిల్‌మెంట్‌ పూర్తికావడంతో గత ప్రమోటర్ల అవకతవకల కారణంగా తలెత్తిన లెగసీ సమస్యలకు ముగింపు పలికినట్లు రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్శన్‌ రష్మి సలుజ పేర్కొన్నారు. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 జనవరి నుంచి రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ రూ. 9,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రస్తావించారు. కాగా.. తాజా సెటిల్‌మెంట్‌ పూర్తి నేపథ్యంలో తిరిగి ఎంఎస్‌ఎంఈలకు రుణాలందించడం తదితర బిజినెస్‌లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు