‘అది కుదరదు’.. గూగుల్‌కు ఊహించని ఎదురుదెబ్బ!

5 Jan, 2023 16:16 IST|Sakshi

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జరిమానా విధించిన కేసులో టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌)లో ఎదురుదెబ్బ తగిలింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ బుధవారం నిరాకరించింది. అలాగే జరిమానాలో 10 శాతాన్ని డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. అటు సీసీఐకి నోటీసులు ఇవ్వడంతో పాటు మధ్యంతర స్టేపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టంకు సంబంధించి దేశీయంగా గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలపై సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసేందుకు, తమకు కావాల్సిన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పించాలని గతేడాది అక్టోబర్‌లో సూచించింది.

సీసీఐ ఆదేశాలు జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, వీటిపై తక్షణం స్టే విధించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీని గూగుల్‌ ఆశ్రయించింది. భారతీయ యూజర్లు, డెవలపర్లు, తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్‌తో గణనీయంగా ప్రయోజనాలు చేకూరాయని, భారత్‌ డిజిటల్‌కు మారడంలో ఇది తోడ్పడిందని పిటిషన్‌లో వివరించింది. బుధవారం జరిగిన విచారణలో గూగుల్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. గూగుల్‌ గుత్తాధిపత్య దుర్వినియోగానికి పాల్పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్‌.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో!

మరిన్ని వార్తలు