కార్పొరేటర్‌ హత్య కేసు: కృష్ణా జిల్లాలో నిందితుడు?

14 Feb, 2021 10:21 IST|Sakshi

‘ఫార్చ్యూనర్‌’లో నిందితుడి పలాయనం!

కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కార్పొరేటర్‌ కంపర రమేష్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు గురజాన చిన్నా అలియాస్‌ సత్యనారాయణ కృష్ణా జిల్లాలో తలదాచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనా స్థలి నుంచి పారిపోయిన చిన్నా నేరుగా ఇంటికి వెళ్లాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలనే పన్నాగంతో హత్యకు వినియోగించిన హోండా సిటీ కారును ఇంటి దగ్గరే వదిలేశాడు. భార్య, పిల్లలు, తమ్ముడు కుమార్‌తో కలిసి తన మరో కారు ‘ఫార్చూ‍్యనర్‌‌’లో పరారయ్యాడు. సగం దారి వరకూ ఫోన్‌ ఆన్‌లోనే ఉంచాడు. మార్గం మధ్యలో తన ఫోన్‌తో పాటు, భార్య, తమ్ముడి ఫోన్‌లను స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. నిందితుడి జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలు పని చేస్తున్నాయి.

ఇప్పటికే సర్పవరం సీఐ నున్న రాజు తన బృందంతో కలిసి కృష్ణా జిల్లా చేరుకున్నారు. నిందితుడి కోసం శోధన మొదలు పెట్టారు. అక్కడి పోలీసులతో కలిసి చిన్నా కదలికలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అతడి బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ కోకిలా సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మొదలు, కృష్ణా జిల్లాను అనుసంధానం చేసే రహదారిలోని దాదాపు ప్రతి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించేందుకు ప్రత్యేక బృందమే ఏర్పడింది. దీనిపై పోలీస్‌ శాఖ ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది.

టోల్‌గేట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చిన్నా తొలుత రమేష్‌కు ఫోన్‌ చేసి వస్తాననడం నిజం కాదని తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్‌ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నిస్తున్నాడు. అందుకు రమేష్‌ అంగీకరించడం లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్‌ తన స్నేహితులు సతీష్‌, శ్రీనివాస్‌కు శుక్రవారం రాత్రి అంటున్నాడని చెప్పారు. వారి సలహాతోనే చిన్నాను రమేష్‌ రమ్మన్నారని అంటున్నారు. తాను కోనపాపపేటలో ఉన్నానని, తమ్ముడి పుట్టిన రోజని చిన్నా చెప్పాడు. అలా బాధ చెప్పుకుంటానని వచ్చిన వ్యక్తి రమేష్‌ను అతి కిరాతకంగా హతమార్చాడు.
(చదవండి: కాకినాడలో కార్పొరేటర్‌ దారుణ హత్య )
శునకం తెచ్చిన తంటా..  

మరిన్ని వార్తలు