అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు

20 Jan, 2021 03:10 IST|Sakshi
సిమెంట్‌ దిమ్మెపై టీడీపీ నేతలు నంది విగ్రహాన్ని పెడుతున్న సమయంలో సీసీటీవీలో నమోదైన దృశ్యం

బెడిసికొట్టిన అచ్చెన్నాయుడు బ్యాచ్‌ మత విద్వేషాల ప్లాన్‌

విద్వేషాలు రగిల్చేందుకు నంది విగ్రహంతో కుట్ర

సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి జంక్షన్‌లో ఘటన

సీసీటీవీ ఫుటేజీతో బయటపడ్డ బాగోతం

కుట్రలో ఈనాడు విలేకరికీభాగస్వామ్యం

22 మందిపై కేసు నమోదు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/విశాఖపట్నం: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్కడి పాలేశ్వరస్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు జీర్ణావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్‌ వద్ద గల సిమెంట్‌ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్‌ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పింది. ఆ తరువాత పాలేశ్వరం జంక్షన్‌లో ఉన్న నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరగబోతోందంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని భావించింది. ఆలయం నుంచి పాత నంది విగ్రహాన్ని తరలించడం.. దానిని పాలేశ్వరస్వామి జంక్షన్‌లోని దిమ్మెపై ఏర్పాటు చేయడం తదితర దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ నాయకుల ప్లాన్‌ బెడిసికొట్టింది. ఈ కుట్రలో అచ్చెన్నాయుడు అనుచరులతో పాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే టెక్కలి ఈనాడు విలేకరి వట్టికూళ్ల కీర్తికుమార్‌ కూడా ఉన్నారు. 

22 మందిపై కేసు నమోదు : డీజీపీ
రాష్ట్రవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి జంక్షన్‌లో శిథిలమైన నంది విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు ఉందని విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే ఒక రాజకీయ పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు సహా ఆరుగుర్ని అరెస్ట్‌ చేశామని తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. రామతీర్థం ఘటనలో నిందితుల్ని పట్టుకునేందుకు 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని  గొలుగొండ గ్రామంలో పురాతనమైన, శిథిలమైన విగ్రహాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాన్నారు. 

ఆలయాలపై ప్రత్యేక నిఘా
విశాఖ రేంజి పరిధిలో 7,700 ఆలయాల్లో సెక్యూరిటీ గార్డులను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డీఐజీ చెప్పారు. ఇప్పటికే  3 వేల ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను నియమించామని, మరో 1500 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.  

మరిన్ని వార్తలు