నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా

24 Mar, 2021 09:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: తనతో స్నేహం చేయాలంటూ వివాహితను తరచూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై, అతడికి సహకరించిన మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ క్లినిక్‌లో మెడికల్‌ హెడ్‌గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్‌ అనే క్లైంట్‌ వెంట క్లినిక్‌కు వచి్చన విశ్వనాథ్‌ అనే వ్యక్తి ఆమె ఫోన్‌ నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్‌కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్‌ ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్‌ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు.

ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతడు నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్లడంతో అక్కడి నుంచి విశ్వనాథ్‌ పరారయ్యాడు. కారులో తనిఖీ చేయగా జీపీ ఎస్‌ పరికరం దొరికింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మరోసారి విశ్వనాథ్‌ నీ భార్య జోలికి రాడంటూ సురేష్‌ అనేవ్యక్తి ఫోన్‌ చేశాడు. పులి శ్రీకాంత్‌ పటేల్‌ అనే రాజకీయ నేత కూడా ఫోన్లు చేస్తూ రాజీకుదుర్చుకుందామని లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వై.విశ్వనాథ్, సురేష్‌, శ్రీకాంత్‌ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు