Prakasam Bus Accident: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

11 Jul, 2023 09:11 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు.  ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ అజీస్‌(65), జానీబేగం(65), అబ్దుల్‌ హనీ(60), నూర్జహాన్‌(58), షేక్‌ రమీజ్‌(48), షబీనా(35), షేక్‌ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్‌ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు.
 

మరిన్ని వార్తలు