బైక్‌ను ఢీకొట్టిన కేంద్రమంత్రి కారు.. ఒకరు మృతి

7 Nov, 2023 19:37 IST|Sakshi

భోపాల్‌: కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. కేంద్రమంత్రి సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఈనెల 17న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రహ్లాద్‌ పటేల్‌ మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచారు. ఈ క్రమంలో మంగళవారం చింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని  నార్సింగ్‌పూర్‌కు వెళ్తుండగా అమర్‌వారా వద్ద ప్రమాదం జరిగింది. సింగోడి బైపాస్‌ సమీపంలో మంత్రి కాన్వాయ్‌ను రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని నిరంజన్ చంద్రవంశీగా(33) గుర్తించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిరంజన్‌.. బైక్‌పై పిల్లలు నిఖిల్‌ నిరంజన్‌, సంస్కర్‌ నిరంజన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  మొత్తం ముగ్గురికి గాయాలవ్వగా..వారిని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే మంత్రి ఎస్‌యూవీ కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.  
చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

మరిన్ని వార్తలు