బ్యాగ్‌ల అడుగున దాచి..

3 Sep, 2023 05:28 IST|Sakshi

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.50 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

లావోస్‌ నుంచి డ్రగ్స్‌ తెచ్చినట్టు గుర్తింపు.. ఒకరి అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత­ర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్‌ పట్టుబడింది. బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమా­చారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.

ఈ మేరకు డీఆర్‌ఐ అధికా­రులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు.

అతడు హైదరాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్‌ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్‌ ఉన్నట్టు గుర్తించారు.

ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్‌ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు