Hyderabad: మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అస‌లేం చేశాడంటే?

17 Nov, 2023 10:47 IST|Sakshi

వివిధ కేసుల్లో నిందితుడు

నిందితుడి అరెస్టు!

రూ.27 తులాల బంగారు ఆభరణాల స్వాదీనం..

సాక్షి, హైద‌రాబాద్‌/రంగారెడ్డి: మాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని మార్కెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో  మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్‌ ఇన్స్‌పెక్టర్‌ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు.

జిల్లా కందుకూరు మండలం నెడనూర్‌ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో వివాహం జరిగి గొడవలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో శ్రీనాథ్‌ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. భారత్‌ మాట్రిమోనీలో  విడాకులు తీసుకున్న ఓ మహిళ రెండవ పెళ్లి కోసం నమోదు చేసుకోగా ఆమె ప్రొఫైల్‌ను సేకరించాడు. ఆమెకు ఫోన్‌ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు.

వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫొటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లి చేసికుంటానని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ ఈ నెల 7న సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాత్రి ఇన్‌ హోటల్‌కు వచ్చారు. రెడీ అయ్యే ముందు వాష్‌ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్‌అప్‌ కావాలని చెప్పాడు. దీంతో ఆమె వాష్‌ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్‌ నుంచి పరారయ్యాడు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వివిధ కేసుల్లో నిందితుడు..
► ఇదే విదంగా నిందితుడు మోహన్‌రెడ్డి షాదీ డాట్‌ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని ఓ మహిళను నమ్మించాడు. ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమె క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు.
► మరో మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్‌లో వేసుకున్నాడు.
► కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు.  
► కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తన బంధువుకే కారు పేరుతో రూ.4.50లక్షలు మోసం చేశాడు. మాదాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌ తదితర వస్తువులను దొంగతనం చేశాడు. 
► చైతన్యపురిలో మరో హాస్టల్‌లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌ దొంగతనం చేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు