-

ప్రైవేట్‌ హాస్టల్‌పై ఎక్సైజ్‌ దాడి

29 Dec, 2022 04:29 IST|Sakshi

48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఒక పేయింగ్‌గెస్ట్‌ హాస్టల్‌పై బుధవారం ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడిచేసి కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌పై దాడి చేశారు.

నూతన సంవత్సర వేడుకల సమయంలో అమ్మేందుకు కొకైన్, ఎండీఎంఏను నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు హుటాహుటిన దాడి చేశారు. ఈ క్రమంలో 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ1గా హరి సతీశ్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. గ్రాము కొకైన్‌ను రూ.10 వేలు, గ్రాము ఎండీఎంఏను రూ.5వేల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం అందడంతో దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసి అమీర్‌పేట్‌ ఎస్‌హెచ్‌వో జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు