అల్లుడి చేతిలో మామ హతం

26 Nov, 2023 08:06 IST|Sakshi

బిచ్కుంద: సంసార విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవ క్షణికావేశంలో పరస్పర దాడులతో రెండు ప్రాణాలు బలిగొన్నాయి. బిచ్కుంద మండలంలోని గుండెనెమ్లిలో శుక్రవారం అర్థరాత్రి పరస్పర దాడులతో రాంబోయి (62), శాంతాపూర్‌ సైదాబోయి (42) మృతి చెందారు.

సీఐ కృష్ణ, ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. గుండెనెమ్లికి చెందిన అరుణతో శాంతాపూర్‌ గ్రామానికి చెందిన సైదాబోయితో ఐదేళ్ల క్రితం రెండో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన సైదాబోయి తరచూ భార్యను వేధిస్తుండడంతో అరుణ కూతురుతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది. రెండున్నరేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు.

దీంతో భార్యపై కోపం పెంచుకున్న సైదాబోయి శుక్రవారం రాత్రి గుండెనెమ్లికి చేరుకొని అరుణతో గొడవ పడి దాడి చేశాడు. గొడవలో అడ్డుగా వచ్చిన మామా రాంబోయి తలపై అల్లుడు సైదాబోయి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి విషయం తెలుసుకున్న రాంబోయి కుమారుడు సాయిలు తన తండ్రిని చంపాడనే కోపంతో బావ సైదాబోయిపై అదే కర్రతో దాడి చేయడంతో మృతిచెందాడు. మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు