వీడియో: పెళ్లి ఊరేగింపులో విషాదం.. దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు

24 Jun, 2022 07:35 IST|Sakshi

మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు.

పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  

మనీష్‌ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్‌ స్నేహితుడు బాబూ లాల్‌ యాదవ్‌ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్‌నే మనీష్‌ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్‌. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్‌.. గన్‌ను కిందకు దించగానే ట్రిగ్గర్‌ నొక్కుకుపోయి బుల్లెట్‌ బాబూ లాల్‌ శరీరంలోకి దూసుకుపోయింది.  

బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్‌ మేదషియాను అరెస్ట్‌ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.  మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం.

మరిన్ని వార్తలు