ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట

27 Oct, 2023 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెంగళరావునగర్‌(హైదరాబాద్‌): ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్‌ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది.

ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్‌ డివిజన్‌లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. కట్‌ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్‌ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్‌ ఎస్‌ఐ ఇక్బాల్‌ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు.

అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్‌ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు.

దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు నేనూ సర్వస్వం అర్పించాను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌తోపాటు ఎస్‌ఐ ఇక్బాల్‌ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు బాబా ఫక్రుద్దీన్‌ను పోలీసులు రిమాండ్‌ తరలించి ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి: తెలియకుండా విదేశాలకు భార్య! భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు