యువకుడిని తొండంతో కొట్టి చంపిన ఏనుగు

15 Apr, 2021 09:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పలమనేరు(చిత్తూరు జిల్లా): పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువకుడిని ఒంటరి ఏనుగు తొండంతో కొట్టి చంపిన ఘటన పలమనేరు మండలంలోని కాలువపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన త్యాగరాజు కుమారుడు జానకిరామ(27) తమ పొలం సమీపంలోని ఓ ఆలయంలో రాత్రిపూట పడుకుంటూ వరిపొలానికి నీరు పెట్టేవాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో త్రీఫేస్‌ కరెంట్‌ రావడంతో సెల్‌ఫోన్‌ టార్చ్‌ వేసుకుంటూ పొలానికి బయలు దేరాడు.

ఏదో అలికిడి కావడంతో స్మార్ట్‌ఫోన్‌ టార్చ్‌తో చూశాడు. టార్చ్‌ కాంతి  పొలం సమీపంలో పొదల చాటునున్న ఒంటరి ఏనుగు కళ్లలో పడింది. దీంతో ఆగ్రహించిన ఏనుగు తొండంతో అతన్ని తలపై బలంగా కొట్టింది. దీంతో మెదడుకు దెబ్బ తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత సేపటికి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు  సిబ్బంది గమనించి పోలీసులు, ఫారెస్ట్‌ సిబ్బందికి తెలిపారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బిడ్డ ఏనుగు దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబీకులు కన్నీరు మున్నీరై రోధించారు.

( చదవండి: కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. ) 

మరిన్ని వార్తలు