విశాఖ సెంట్రల్‌ జైల్‌కు నూతన్‌ నాయుడు

7 Sep, 2020 05:12 IST|Sakshi
నూతన్‌ నాయుడిని సెంట్రల్‌ జైల్‌కు తరలిస్తున్న దృశ్యం

14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు 

సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేశ్‌ పేరిట పలువురికి ఫోన్‌ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్‌ నాయుడికి కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయనను విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య ప్రియామాధురి సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. 

► శ్రీకాంత్‌పై దాడి చేసేటప్పుడు, శిరోముండనానికి ముందు నూతన్‌ తన భార్యతో వీడియో కాల్‌ మాట్లాడినట్లు నిర్ధారణ కావడంతో ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. 
► తన పేరిట పైరవీలకు పాల్పడుతున్నారని మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి రమేశ్‌ విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పారిపోతున్న నూతన్‌ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. 
► అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై శనివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో విశాఖకు తీసుకొచ్చారు. 
► అనంతరం కరోనా టెస్ట్‌తో పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు. 
► కరోనా టెస్ట్‌ నెగిటివ్‌ రావడంతో ఆదివారం ఆయనని కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.
► పి.వి.రమేశ్‌ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్‌ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు